శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (19:39 IST)

జగన్ పైన పవన్ మాటల దాడి ఎందుకు పెంచారు...?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొన్ని రోజులుగా మాటల దాడి తీవ్రం చేశారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఎంతగా విమర్శిస్తున్నారో జగన్‌నూ అంతగా దుయ్యబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే… జగన్‌పైనే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
 
జగన్‌ ఏమీ ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు పోలేదు. అవినీతికి పాల్పడి వేలాది కోట్లు సంపాదించి జైలుకు పోయారు. జగన్‌ లాగా నా వద్ద వేలాది కోట్లు లేవు… అంటూ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంత టార్గెటెడ్‌గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇందులో ఏమైనా వ్యూహం ఉందా?
 
కచ్చితంగా వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. బిజెపి, జగన్‌, పవన్‌ కలిసిపోతున్నారంటూ చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులంతా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఒకటే అని ఊరూవాడా చెబుతున్నారు. వాస్తవంగా వపన్‌ కల్యాణ్‌ వామపక్షాలతో కలిసి పని చేస్తున్నారు. అయినా తెలుగుదేశం వ్యూహాత్మకంగా పవన్‌ను దెబ్బకొట్టడం కోసం… ఆయన్ను బిజెపి, వైసిపిలతో కలిపి చూపిస్తోంది.
 
ఇదే సమయంలో టిడిపితో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా పవన్‌న్‌పై దాడి చేస్తోంది. వైసిపి, జనసేనలను బిజెపి తెరవెనుక నుంచి నడిపిస్తోందని, ఎన్నికల సమయంలో జగన్‌, పవన్‌ పొత్తు పెట్టుకుంటారని ప్రచారం చేస్తోంది.
 
కాంగ్రెస్‌, టిడిపి చేస్తున్న ప్రచారం జగన్‌ కంటే పవన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అందుకే తనకు బిజెపి, వైసిపిలతో ఎటువంటి సంబంధమూ లేదన్న స్పష్టత ఇచ్చేందుకు పవన్‌ కల్యాణ్‌ వైసిపిపైన విమర్శలు తీవ్రం చేశారు. తెలుగుదేశం కంటే వైసిపిని బలంగా విమర్శిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.