మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (10:45 IST)

అనుమానిస్తోందని... ఇద్దరు కూతుళ్లతో సహా భార్యను హత్య చేసిన భర్త

అనుమానం వారి మధ్యన పెనుభూతంగా మారింది. అనుమానంతో తనను వేధిస్తోందని ఓ భార్యను భర్త హతమార్చాడు. అందుకు సాక్షులుగా మిగులుతారని తన ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి చంపాడు. ఆపై అందరిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కర్నూలు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
 
డోన్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన శ్యాంకుమార్‌రెడ్డి భార్య వణిపెంట రాణి (30), కుమార్తెలు నేహారెడ్డి(05), లక్ష్మితనూజరెడ్డి (02)లు  ఈ నెల 7వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కాలిబూడిదయ్యారు. ఒళ్లు గగుర్పాటు పుట్టించే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే భర్త శాంకుమార్ రెడ్డి ఆపై కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది. 
 
గురువారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తచ్చాడుతున్న శ్యాంకుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. తన భార్య తనను నిత్యం అనుమానంతో వేధించేదని, తాను పుట్టింటికి వెళ్లిన సమయంలో వేరొకరితో  వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమాన పడేదని చెప్పాడు. వేధింపులు తాళలేకనే 7వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో ఉన్న రాణిని మొఖంపై దిండు అదిమి ఊపిరి ఆడకుండా హత్య చేశానన్నారు.
 
అదే సమయంలో అక్కడే తన కుమార్తెలు నేహారెడ్డి, లక్ష్మితనూజారెడ్డిలు ఉన్నారని, ఈ విషయాన్ని వారు ఎక్కడ బయట చెబుతారోనన్న భయంతో వారిని కూడా గొంతు నులిమి చంపేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టానని విచారణలో వెల్లడించినట్లు ఎస్‌ఐ సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు.