బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (09:15 IST)

కొడుకును కనలేదని భార్యను హత్య చేసిన భర్త... ఆలస్యంగా వెలుగులోకి

కొడుకును కనలేదని భార్యను భర్తే హత్య చేసిన సంఘటన చిత్రాడ ఎస్సీ పేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. చిత్రాడ ఎస్సీ పేటలో ఎదురెదురు ఇళ్లకు చెందిన నాగేశ్వరరావు, శ్రీలక్ష్మీ (28)ని 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీలక్ష్మికి తొలి కాన్పులో ఆడ పిల్ల పుట్టింది. మళ్లీ మూడు నెలల క్రితం మరో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. 
 
అయితే మగ బిడ్డను కనమంటూ నాగేశ్వరరావు భార్య వేదించ సాగాడు. దీంతో వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు ఏర్పడుతూ వచ్చాయి.  ఈ స్థితిలో గురువారం అర్ధరాత్రి సమయంలో నాగేశ్వరరావు ఇంటి నుంచి కేకలు వినిపించడంతో శ్రీలక్ష్మి పుట్టింటి వారు అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే కింద పడి ఉన్న శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాగేశ్వరరావు వారికి చెప్పాడు. 
 
దీంతో వారు ఆమెను ఆటోలో పిఠాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. దీపావళి పొగకు ఉక్కిరిబిక్కిరై స్ఫృహ తప్పిందని అక్కడి డాక్టర్‌కు చెప్పారు.  ఆమెను పరిశీలించి డాక్టర్ అప్పటికే చనిపోయిందని, ఆమెను హత్య చేసి ఉంటారని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే కుమార్తెను హత్య చేసిన విషయాన్ని శ్రీలక్ష్మి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చెయ్యకూడదని, అందుకు బదులుగా ఆమె ఇద్దరు బిడ్డలకు చెరో రూ. 50 వేలు, ఇల్లు ఇచ్చేందుకు  పెద్ద సమక్షంలో నాగేశ్వరరావు లిఖితపూర్వకంగా అంగీకరించాడు. 
 
పేదరికంతో ఇద్దరు ఆడ పిల్లలను సాకడం కష్టమన్న భావనతో శ్రీలక్ష్మి కుటుంబం ఒప్పుకున్నారు. అయితే ఈ వ్యవహరాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 100 నంబర్‌కి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో శుక్రవారం పోలీసులు చిత్రాడ వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం శ్రీలక్ష్మిని ఖననం చేసిన చోటును పోలీసులు సందర్శించారు. మృత దేహాన్ని శనివారం తహశీల్దార్ సమక్షంలో వెలికి తీయించి, పోస్టు మార్టం చేయిస్తామని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతురాలి తండ్రి బొడ్డరాడ ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు.