శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (10:06 IST)

కేవీపీ ప్రైవేట్ బిల్లుపై చర్చ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోడీ ఏం చేశారో వివరిద్ధాం!

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారో సవివరంగా వివరించుదామని భారతీయ జ

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారో సవివరంగా వివరించుదామని భారతీయ జనతా పార్టీ నేతలు నిర్ణయించారు. 
 
ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్‌ జరపాలంటూ మంగళవారం రాజ్యసభను కాంగ్రెస్‌ సభ్యులు స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. అయితే అది ద్రవ్య బిల్లు పరిధిలోకి వస్తుందని, ద్రవ్యబిల్లును లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలని, రాజ్యసభలో పెట్టే అవకాశం లేదని జైట్లీ మెలికపెట్టారు. అయితే చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ సభకు తెలియజేశారు. 
 
కానీ రాజ్యసభ కార్యకలాపాలను కాంగ్రెస్‌ అడ్డుకోవడంతో ప్రైవేట్ బిల్లుకు చరమగీతం పాడాలని బీజేపీ భావించింది. ద్రవ్యబిల్లు పేరుతో కేవీపీ బిల్లుపై జైట్లీ కొర్రీ వేయడం, దీనిపై లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పడంతో కాంగ్రెస్‌ కూడా మెత్తబడినట్లు తెలిసింది. ఇదేసమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేకపోవడం వల్లే బిల్లును తాను అడ్డుకుంటున్నట్లు ఆంధ్రులు భావిస్తున్నారని గ్రహించిన బీజేపీ నేతలు.. వారిలో అపోహలను తొలగించాలని భావించారు. 
 
ఇందులోభాగంగానే గత రెండేళ్లలో ఆంధ్రకు తమ ప్రభుత్వం ఏమేం ఇచ్చింది.. ఏమేం చేసిందో రాజ్యసభ సాక్షిగా వివరించి మార్కులు కొట్టేయాలని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే సభాపక్ష నేతల సమావేశంలో ప్రత్యేక హోదాపై 2 గంటలపాటు చర్చించేందుకు అంగీకరించారు. అయితే కాంగ్రెస్‌, టీడీపీ డిమాండ్‌ చేస్తున్నట్లుగా ఓటింగ్‌కు మాత్రం ససేమిరా అంటున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చ మొదలవుతుంది.