బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (11:45 IST)

ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను కిడ్నాప్ చేసి.. పత్తిచేనులోకి తీసుకెళ్లి..?

దేశంలో మహిళలపై అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళలపై చెయ్యేసేందుకు కూడా భయపడేలా కఠినమైన చట్టాలు వస్తే తప్ప.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడం కుదరదు. వయోబేధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్న వేళ.. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితను కిడ్నాప్ చేసిన కామపిశాచులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. 
 
ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న 35 ఏళ్ల‌ వివాహిత‌ను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లిన యువకులు స‌మీప‌ పత్తిచేనులోకి తీసుకెళ్లి మరికొందరితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు చ‌ప్పుడు రావడంతో మేల్కొన్న పొరుగింటి యువతి వారిని రహస్యంగా అనుసరించడంతో ఈ ఘటన పోలీసులకు తెలియవచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులను అరెస్ట్ చేయాలంటూ స్థానికులు, బంధువులు రఘునాథపాలెం పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.