శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (16:52 IST)

ప్రేమించలేదని వివాహితను కత్తితో పొడిచిన యువకుడు

ఇపుడు ఒంటరిగా ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు... ప్రేమిస్తున్నానని వెంటపడటం కొంత మంది కుర్రాళ్లకు సరదాగా మారిపోయింది. కానీ ఓ యువకుడు వివాహిత వెంట పడ్డాడు. ప్రేమిస్తున్నాని వేధించసాగాడు. చివరికి గొడవపడి కత్తితో దాడి చేశాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జ్యోతినగర్‌ ఆటోనగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆటోనగర్‌లో నస్పూరి శ్రీనివాస్ ‌(29) ఇల్లు చంటి స్రవంతి (25) ఇంటికి దగ్గర్లోనే ఉంది. స్రవంతికి దాదాపు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇప్పుడు భర్తకు దూరంగా తన పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆమెపై శ్రీనివాస్ కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. తన ప్రేమను అంగీకరించాలంటూ పట్టుబట్టాడు. అమె ససేమిరా అంగీకరించలేదు. 
 
ఈ క్రమంలో గురువారం సాయంత్రం స్రవంతి రహదారిపై వెళుతుండగా గమనించాడు. మళ్లీ వెంటపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ ఆవేశంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను గోదావరిఖని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందటంతో వారు బాధితురాలి ఫిర్యాదును స్వీకరించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.