యువతిపై రేప్.. ఆపై యాసిడ్ పోసి హత్యాయత్నం!
యువతిపై అత్యాచారం జరిపిన అనంతరం యాసిడ్ పోసి హత్యాయత్నం ఘటన మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని దిలాల్పూర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
దిలాల్పూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళను మంగళవారం రాత్రి ధర్మారెడ్డిపల్లికి చెందిన స్వామి, పిడిచెడ్కు చెందిన కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మాయమాటలతో నమ్మించి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
అనంతరం ఆనవాళ్లు తెలియకుండా చేసేందుకు ఆమెపై యాసిడ్ పోశారు. యువతి మరణించిందని భావించిన ఆ వ్యక్తులు అక్కడ నుండి పరారయ్యారు.
అయితే బుధవారం స్పృహలోకి వచ్చిన ఆ యువతి సాయంత్రం గజ్వేల్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.