శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:49 IST)

అనంతలో మహిళను వివస్త్రను చేసి.. చితకబాదిన గ్రామస్తులు..!

సభ్య సమాజాం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులంతా ఏకమై ఓ మహిళను వివస్త్రను చేసి, చితకబాదారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని వడ్డిపల్లి గ్రామంలో కలకలం రేపింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. కళ్యాణి దుర్గానికి చెందిన గౌరీబాయి పది సంవత్సరాల క్రితం హిందూపురం ప్రాంతానికి వలస వచ్చింది. అక్కడ ఆ మహిళ వడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఒక షెడ్‌ వేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
అయితే ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని స్థానికులు భావించారు. ఇందుకోసం ఆ మహిళను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె ససేమిరా అనడంతో ఆమెతో గొడవ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయంలో కల్పించుకున్న పోలీసులు మహిళకు వేరే చోట నివాసం ఏర్పాటు చేసి ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు. ఈ స్థితిలో గ్రామస్థులు కొందరు మంగళవారం రోజు మహిళపై దాడికి పాల్పడ్డారు. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. 
 
సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, గ్రామస్థులు కొందరు మాత్రం ఆ మహిళ మంత్రాలు చేస్తోందని, పలువురితో వ్యభిచారం చేస్తోందని  ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.