గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (12:07 IST)

ఇది ట్రయల్ మాత్రమే... అధికారంలోకి వస్తే వెతికి పట్టుకుని మరీ అన్నీ కోస్తా : చెవిరెడ్డి వార్నింగ్

ప్రభుత్వ ఉద్యోగులకు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోమారు వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి ఊడిగం చేసే వారిని వెతికి పట్టుకుని మరీ అన్నీ కోస్తామంటూ హెచ్చరించారు. పైగా, ఇది ట్రయల్ మాత్రమే

ప్రభుత్వ ఉద్యోగులకు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోమారు వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి ఊడిగం చేసే వారిని వెతికి పట్టుకుని మరీ అన్నీ కోస్తామంటూ హెచ్చరించారు. పైగా, ఇది ట్రయల్ మాత్రమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి సినిమా చూపిస్తామంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ "ఒకడు నా చెవి కోసేస్తానంటాడు.. మరొకడు నా నాలుక కోస్తానంటాడు... ఇంకో ఆయన నా ముక్కు కోస్తానంటాడు. ఇవన్నీ దిగజారుడు మాటలే. అలా అనుకుంటే నేను అన్నీ కోస్తా" అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
చట్టాన్ని, ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తూ సామాన్యులను, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్న కొందరు అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు తప్పనిసరిగా దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. 
 
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించి పచ్చచొక్కా ముసుగులో అశోక్‌బాబు, సాగర్‌ చిలకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తన మాటలను తప్పుపడుతున్న వారు తప్పుచేసిన వారిని వదిలివేయాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.