గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR

తూర్పు గోదావరిలో వైకాపా నేత అరాచకం.. దళిత యువతిపై రేప్!

తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత దళిత యువతిపై మూడు నెలలుగా అత్యాచారం జరుపుతూ వస్తున్నాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూపించి బెదిరిస్తూ గత మూడు నెలలుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారు. అతని వేధింపులు తాళకే ఆ యువతి శనివారం రాత్రి పురుగుల మందు సేవించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లా ఆమనగరువుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుత్తుల సత్యప్రసాద్. గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో సత్యప్రసాద్ కరక్కాయపేటకు చెందిన ఓ దళిత యువతిని నగ్నంగా చిత్రీకరించి తన వద్దకు రావాలని, లేని పక్షంలో ఆ ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగి, గత మూడునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
 
సత్యప్రసాద్ ఆగడాలు మితిమీరిపోవడంతో యువతి గత అర్థరాత్రి దాటిన తర్వాత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ నేత అకృత్యంపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యువతి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.