నెల్లూరులో జగన్ పార్టీ కార్యాలయం ఖాళీ.. ఆధిపత్యపోరా...! అద్దె భరించలేకా..!
నెల్లూరు జిల్లా వైసీపీ అంతర్గత రాజకీయాలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇప్పటికే మేకపాటి, నల్లపరెడ్డి శ్రీ్నివాస రెడ్డిల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తాను అధ్యక్షుడిగా ఉన్నా మేకపాటి సోదరులు అడ్డుతగులుతున్నారని ప్రసన్న ఇప్పటికే రాజీనామా వరకూ వెళ్ళారు. ఇలాంటి తరుణంలో పార్టీ కార్యాలయం బుధవారం ఖాళీ అయ్యింది. ఇలా జగన్ను కలిసిన 48 గంటల్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రసన్న ఖాళీ చేసి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కార్యాలయం రాజన్న భవన్కు ఫర్నిచర్ను తరలించారు.
పార్టీ కార్యాలయ నిర్వహణ ఖర్చును ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ భరిస్తామని మొదట హామీ ఇచ్చి ఆ తరువాత రిక్తహస్తం చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి అద్దె రూ.40వేలు, సిబ్బంది, విద్యుత్ తదితర ఖర్చులన్నీ కలుపుకుంటే నెలకు రూ.1 లక్ష అవసరం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేటప్పుడే ప్రసన్న తన ఆర్థిక పరిస్థితిని జగన్కు వివరించారు. సర్దుబాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం, కొద్దిరోజులుగా అది కార్యరూపం దాల్చకపోవడంతో అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు రోజుల క్రితం ప్రసన్న జగన్ను కలిసి తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా అధ్యక్షుడుగా కొనసాగాల్సిందేనని జగన్ ఆదేశించారు. ఇదిలాఉండగా మేకపాటివారి పోరు పడలేకున్నానని ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి జగన్కు ఫిర్యాదు చేశారు. ఇలా వర్గపోరు కారణంగా తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీకి నెలకు లక్ష రూపాయాలు భరించడం అంతమంది ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాలలో పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే వర్గ పోరు కారణంగానే పార్టీ కార్యాలయం నలిగిపోయి ఖాళీ అయ్యే స్థితికి చేరుకున్నట్లు సమాచారం.