ఆరోగ్యానికి యోగా ఉత్తమమైనది : చంద్రబాబు నాయుడు
తన మంత్రివర్గ సహచరులకు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నుంచి ప్రత్యేక యోగా తరగతులను చెప్పిస్తున్నారు. ఈ యోగా శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరిచేందుకు, అధికారులు మానసికంగా ధృడంగా ఉండేందుకుగాను ఈ తరగతులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఈ కార్యక్రమం వినూత్నమైనదని అన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళను ఎదుర్కొనేందుకు యోగా శిక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పనితీరులో మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నానని బాబు చెప్పారు. ఈషా ఫౌండేషన్ ద్వారా వాసుదేవ్ యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారని అన్నారు. యోగా శిక్షణలో ప్రాముఖ్యతపొందిన జగ్గీ వాసుదేవ్.. శిక్షణ ఇవ్వాలని కోరగానే స్పందించారని చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు. ఒత్తిళ్లను తగ్గించుకోవాడానికి యోగా అత్యుత్తమైనదని ప్రపంచం గుర్తించిందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైన తొలిరోజు యోగా గురువు సద్గురు వాసుదేవ్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో యోగా తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్ అంశంపై యోగా, ఆసనాలు, ప్రాణాయామం, నాయకత్వ లక్షణాలు.. తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.