యువతిని హతమార్చేందుకు వచ్చాడు.. హతుడయ్యాడు..!
ఇటీవల సమాజంలో మృగాళ్లకు ఎదురుతిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ కోవలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులను బెంబేలెత్తించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక యువతిని హతమార్చేందుకు వచ్చిన యువకుడిని బంధువులు కొట్టి చంపారు.
వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి ప్రశాంత్నగర్కి చెందిన ఒక యువతిని రాజు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆ యువకుడికి ఎన్నిసార్లు చెప్పినా తన ఉన్మాదం వదల్లేదు. శుక్రవారం తెల్లవారుఝామున రాజు కొడవలితో తమ ఇంటికి వచ్చి తమ కుమార్తెను చంపడానికి ప్రయత్నించాడని, తామంతా కలిసి రాజును చంపేశామని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపి లొంగిపోయారు.
ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులతోపాటు ఆ యువతి కూడా స్వల్పంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.