గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:01 IST)

పట్టిసీమ ప్రాజెక్టుతో చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు : జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత, అసెంబ్లీ విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు అందినట్టు ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ బస్సు యాత్రను జగన్ చేపట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్ర గురువారం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజినీర్లు, రైతులతో ఆయన మాట్లాడారు. 
 
అనంతరం ప్రసంగిస్తూ ప్రకాశం బ్యారేజ్‌లో నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలే ఉందని ఇక్కడి ఇంజినీర్లు నాకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో గోదావరి నది నుంచి నీరు వస్తే నిల్వచేయడం ఎలా సాధ్యమవుతుంది? ఆయన ప్రశ్నించారు. సాధారణంగా వర్షాకాలంలో కృష్ణా, గోదావరి నదులు పొంగుతూ ఉంటాయని, అందులో కొంత నీరు సముద్రంలోకి వెళుతుందన్నారు. 
 
అలా వ్యర్థంగా పోయే నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా నిల్వ చేయొచ్చని, పట్టిసీమ ప్రాజక్టు ద్వారా చేయలేమన్నారు. పోలవరంతో 124 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని వివరించారు. కానీ ప్రభుత్వం అలాంటి ఉపయోగకరమైన ప్రాజెక్టును పక్కన పెట్టాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. 
 
పట్టిసీమ పూర్తయితే కర్ణాటక, మహారాష్ట్రలు మనకు 35 టీఎంసీల నీటిని విడుదల చేయడం ఆపివేస్తాయని, ఇవన్నీ పూర్తిగా తెలిసిన చంద్రబాబు ప్రాజెక్టుపై ముందుకు వెళుతున్నారని, కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేందుకే ఇలా చేస్తున్నారని, తద్వారా రూ.300 కోట్ల ముడుపులు చంద్రబాబుకు ముట్టాయని జగన్ ఆరోపించారు.