గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (16:08 IST)

ప్రతిసారీ వెన్నుపోటు పొడవడం.. మోసం చేయడం కుదరదు : జగన్

ప్రతిసారీ వెన్నుపోటు పొడవడం కుదరదని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో అన్ని విషయాలూ అందరికీ తెలిసిపోతున్నాయన్నారు. అందువల్ల ఎల్లవేళలా మోసం చేయచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, వెన్నుపోటు పొడవొచ్చు అనుకుంటే కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారని విమర్శించారు. సీఎం తన కార్యాలయంలో ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిపోతోందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల మహిళలు తాము తీసుకున్న రుణాలపై 18 శాతం వడ్డీ కట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే, జగన్ మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు సభలో లేక పోవడం గమనార్హం. 
 
అంతకుముందు వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై జగన్ సభకు వివరణ ఇచ్చారు. స్పీకర్ను దించేయాలన్న ఉద్దేశ్యంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోలేదని అన్నారు. సభ తీరు, సభలో జరిగిన వ్యవహారాలు తమను తీవ్రంగా బాధపెట్టాయని, సభాపతి స్థానంలో ఉన్న మీరు(స్పీకర్) మాకు న్యాయం చేస్తారని అనుకున్నామని చెప్పారు. తమ దగ్గర ఉన్న సభ్యులు 67 మందేనని, వారితో మేం స్పీకర్ను పదవిలో నుంచి దించేయాలని మేం అనుకోలేదని చెప్పారు.
 
గతంలో చంద్రబాబునాయుడు ఇలా వ్యవహరించారో లేదో తెలియదని ప్రస్తుతం సభలో పరిస్థితులు, పరిణామాలు మాత్రం తమను తీవ్రం బాధించాయని చెప్పారు. స్పీకర్గా తమ పేరును ప్రతిపాదించిన వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించామని, సాంప్రదాయబద్ధంగా నడుచుకుని తమను సీట్లో కూర్చోబెట్టామని గుర్తు చేశారు. 
 
తమపై మాకు ఎంతో విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. తమతో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు సంప్రదింపు జరిపారని సభలో తెలియజేశారు. ఆయన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ తాము బాధపడకుండా చూసుకుంటారనే విశ్వాసంతోనే అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకుంటున్నామని పేర్కొన్నారు. దీంతో ఏప్రిల్ 4వ తేదీన శాసన సభ ప్రత్యేక సమావేశం లేదని సభాపతి చెప్పారు.