శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (14:54 IST)

సభాపతిని దింపేందుకు అవిశ్వాస నోటీసు ఇవ్వలేదు : జగన్

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్‌ను సీటు నుంచి దించాలన్న ఉద్దేశ్యంతో అవిశ్వాస నోటీసు ఇవ్వలేదంటూ అసెంబ్లీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీంతో అవిశ్వాసం విషయంలో వైకాపా వెనక్కి తగ్గినట్టయింది. 
 
శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ యువ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని లేవనెత్తి.. వైకాపా సభ్యులతో మాట్లాడారు. ఇందుకోసం ఆయన టీడీపీ, స్పీకర్‌, జగన్‌కు మధ్య మధ్యవర్తిత్వం వహించారు. ఆ తర్వాత సభలో ఈ అంశం చర్చకు వచ్చింది. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. స్పీకర్ను దించేయాలన్న ఉద్దేశ్యంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోలేదని అన్నారు. సభ తీరు, సభలో జరిగిన వ్యవహారాలు తమను తీవ్రంగా బాధపెట్టాయని, సభాపతి స్థానంలో ఉన్న మీరు(స్పీకర్) మాకు న్యాయం చేస్తారని అనుకున్నామని చెప్పారు. తమ దగ్గర ఉన్న సభ్యులు 67 మందేనని, వారితో మేం స్పీకర్ను పదవిలో నుంచి దించేయాలని మేం అనుకోలేదని చెప్పారు.
 
గతంలో చంద్రబాబునాయుడు ఇలా వ్యవహరించారో లేదో తెలియదని ప్రస్తుతం సభలో పరిస్థితులు, పరిణామాలు మాత్రం తమను తీవ్రం బాధించాయని చెప్పారు. స్పీకర్గా తమ పేరును ప్రతిపాదించిన వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించామని, సాంప్రదాయబద్ధంగా నడుచుకుని తమను సీట్లో కూర్చోబెట్టామని గుర్తు చేశారు. 
 
తమపై మాకు ఎంతో విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. తమతో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు సంప్రదింపు జరిపారని సభలో తెలియజేశారు. ఆయన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ తాము బాధపడకుండా చూసుకుంటారనే విశ్వాసంతోనే అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకుంటున్నామని పేర్కొన్నారు. దీంతో ఏప్రిల్ 4వ తేదీన శాసన సభ ప్రత్యేక సమావేశం లేదని సభాపతి చెప్పారు.