శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (09:57 IST)

చంద్రబాబును ఫాలో అవుతున్న జగన్.. ఎందుకంటే..?

అధికారం రాగానే జగన్ దూకుడు పెంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించడంతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ప్రక్షాళన ప్రారంభించేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఏం చేశారు... ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారంటూ గతంలోనే ఆరోపణలు చేసిన జగన్... ఇప్పుడు వాటి ఆధారాలను వెలికితీసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
 
అంతేకాదు చంద్రబాబును ఒకవైపు ఇబ్బందులకు గురిచేయాలని భావిస్తూనే మరోవైపు చంద్రబాబు గతంలో కేంద్రంతో ఏవిధంగా ఉన్నారో అదేవిధంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు జగన్. మొదట్లో మోడీతో బాగా కలిసి ఉన్న చంద్రబాబు ఆ తరువాత విడిపోయారు. మోడీ-చంద్రబాబులు ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఏవిధంగా కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు. నరేంద్రమోడీని ఏ విధంగా బాగా దగ్గరయ్యారు. రాష్ట్రానికి నిధులు ఏ విధంగా తీసుకురాగలిగారన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన జగన్ ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు.
 
బిజెపి దేశంలో భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన తిరుమల శ్రీవారికి మ్రొక్కులు సమర్పించుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరుమలకు రాబోతున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు జగన్ కూడా తిరుపతికి వస్తున్నారు. అయితే మోడీతో పాటు జగన్ కూడా అదే రోజు తిరుమలలో బస చేసి మోడీతో ప్రత్యేకంగా బేటీ కావాలనుకుంటున్నారు.
 
ప్రత్యేక హోదా విషయంతో పాటు విభజన హామీలకు సంబంధించి మోడీతో జగన్ చర్చించబోతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేశారు. దీంతో జగన్ కూడా ఇదేవిధంగా ఫాలో అవుతూ ఎపికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి మెల్లమెల్లగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.