బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (16:09 IST)

సూటిగా.. సుత్తిలేకుండా చెప్పండి.. పట్టిసీమకు అనుకూలమా?.. వ్యతిరేకమా?: వైసీపీకి చంద్రబాబు ప్రశ్న

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా బుధవారం పట్టిసీమపై రసవత్తర చర్చ జరిగింది. ఇందులో వైకాపా విపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబ నాయుడుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పట్టిసీమపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు కల్పించుకుని అసలు వైసీపీ పార్టీ పట్టిసీమకు వ్యతిరేకమా? లేదా అనుకూలమా? అని పలుమార్లు ప్రశ్నించారు. అయినప్పటికీ వైసీపీ నేతల నుంచి కానీ, నెహ్రూ నుంచీ కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో సభలో ఎప్పటిలానే చర్చ కొనసాగింది. 
 
అంతకుముందు ప్రాజెక్టుపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదన్నారు. పట్టిసీమ పూర్తి కాకుండానే జాతికి అంకితం చంద్రబాబుకే దక్కిందన్నారు. హెడ్ వర్క్ పనులు పూర్తి కాకుండా జాతికి ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, కానీ అనుసంధాన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది రూ.200 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేవలం ధనార్జన కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు.