శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (12:03 IST)

కోడలు మగ బిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా?: బాబుపై రోజా ఫైర్

కోడలు మగ బిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా? అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రోజా తప్పుబట్టారు. మహిళలంటే చంద్రబాబుకు అంత చులకనా? అని మండిపడ్డారు. అమ్మణ్ణమ్మ లేకపోతే చంద్రబాబు పుట్టేవారా? భువనేశ్వరి లేకపోతే చంద్రబాబుకు లోకేష్ అనే వారసుడు ఉండేవాడా? అని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. 'యథా రాజ తథా ప్రజ' సామెత లాగ... చంద్రబాబు ఎలా ప్రవర్తిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అలానే ప్రవర్తిస్తారని రోజా విమర్శించారు.
 
జగన్‌కు అసెంబ్లీ కొత్త అని టీడీపీ నేత బోండా ఉమ అనడాన్ని రోజా తప్పుబట్టారు. బోండా ఉమ ఏమైనా 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారా? అని ప్రశ్నించారు. కేవలం మోడీపై ఉన్న క్రేజ్, పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈరోజు పవన్‌కు టీడీపీ భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 
 
టీడీపీకి అంత సీన్ ఉంటే, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పవన్ ఇంటి ముందు పడిగాపులు ఎందుకు పడ్డారని అన్నారు. ఒక వైపు పుష్కర తొక్కిసలాటపై చర్చిద్దామంటూనే, మరోవైపు జగన్‌‌ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే బీజేపీ కాళ్ల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు.