గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (14:12 IST)

వేట కొడవళ్ళతో వెంటాడి.. వేటాడి.. వైకాపా నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ జిల్లాలో మళ్లీ రాజకీయ హత్యలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలో అధికార టీడీపీ వర్గాలు వ్యక్తిగత కక్షల కారణంగా ఇద్దరిని హత

కర్నూలు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ జిల్లాలో మళ్లీ రాజకీయ హత్యలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలో అధికార టీడీపీ వర్గాలు వ్యక్తిగత కక్షల కారణంగా ఇద్దరిని హత్య చేసి గంటలు పూర్తికాకముందే కర్నూలు జిల్లాలో వైకాపా నేత దారుణ హత్యకు గురయ్యాడు. 
 
వైసీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. నారాయణ రెడ్డిపై ప్రత్యర్థులు కొందరు, బాంబులు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. పెళ్లికి వెళ్లొస్తున్న ఆయన కారుపై తొలుత బాంబులు వేసి అనంతరం చాలా విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు. 
 
ఈ ఘటన వెల్దుర్తి మండలం కృష్ణగిరి వద్ద చోటు చేసుకుంది. ఈ దాడిలో ఆయనకు కీలక అనుచరుడిగా ఉన్న సాంబశివారెడ్డిని కూడా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని కొద్ది రోజుల కిందటే తన లైసెన్స్‌ ఆయుధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనుమతికోసం పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు.
 
ఆయన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలుసుకున్న తర్వాతే ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ హత్య చేశారు. ఆదివారం ఉదయం నారాయణ రెడ్డి నంద్యాలలో సూర‍్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి, అలాగే, వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో కె.సాక్షి హనుమంతు కుమారుడు కె.రమేశ్‌ వివాహానికి హాజరయ్యారు.  అనంతరం ఉదయం 11.30 గంటలకు కారులో స‍్వగ్రామానికి వస‍్తుండగా కృష‍్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల‍్వర్టు వద‍్ద కాపు కాసిన ప్రత్యర్థులు తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీ కొట్టించారు.
 
ఆ తర్వాత ఎదురుగా మూడు ట్రాక్టర్లు పెట్టి ఆ వెంటనే బాంబులు విసిరారు. ఆ వెంటనే దాదాపు నారాయణపై దాదాపు 15 నుంచి 20 మంది ఒకేసారి దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికేశారు. గత ఎన్నికల్లో ఆయన కేఈ కృష్ణమూర్తిపై ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం నారాయణ రెడ్డికి విపరీతమైన ప్రజాబీమానం పెరగడం, క్రీయాశీలకంగా వ్యవహరించడం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వాళ్లే ఈ హత్య చేయించినట్లు పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
చెరుకులపాడు నారాయణ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి కేఈ కృష్ణమూర్తిపై ఓడిపోయారు. ఎన్నికల అనంతరం నారాయణ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈయనకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరుంది. కప్పట్రాళ్ల హత్యకేసులో నారాయణరెడ్డి నిర్దోషిగా బయటపడ్డారు. కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో నారాయణరెడ్డి కీలక నేతగా ఉన్నారు.