శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (10:44 IST)

వైఎస్సార్ సీపీ సరికొత్త కార్యక్రమం ‘నిన్ను నమ్మం బాబూ..’

ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మక ద్రోహం, అన్యాయాలకు పాల్పడ్డారనీ, దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ‘నిన్ను నమ్మం బాబూ..’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ యాత్రకు సంఘీభావంగా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. 
 
జనవరి 3 నుంచి 7 వరకు ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ నాయకత్వంలో, నియోజకవర్గ బూత్ కమిటీ సమన్వయకర్త, మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు ‘నిన్ను నమ్మం బాబూ..’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, రోజుకు రెండు చొప్పున పది గ్రామాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. 
 
గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీలను, మోసాలను ప్రజలకు వివరించనున్నట్టు వైసీపీ తెలియజేసింది. అంతేకాదు చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ ప్రజలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావం చూపిస్తామని అంటోంది వైసీపీ. మరి జనం నిజంగా... నిన్ను నమ్మం బాబూ అని ఓట్లు వైసీపికి వేస్తారో లేదో చూడాలి.