గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: గురువారం, 20 జూన్ 2019 (20:39 IST)

అందుకే రాజ్యసభ తెదేపాను విలీనం చేశాం... తెదేపా ఎంపీలు

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరారు. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.
 
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు విదేశీ యాత్రలో ఉన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరికి బీజేపీ కండువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, పార్లమెంటులో కాలికి గాయమైన గరికపాటి మోహనరావు చికిత్స తీసుకుంటున్నారని, అందుకే రాలేకపోయారని బీజేపీ నాయకులు భూపేందర్ చెప్పారు.
 
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘‘సుజనా, రమేశ్, టీజీ, మోహనరావులు చాలా కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి చేపట్టిన చర్యలు, అమిత్ షా వ్యవస్థీకృత నైపుణ్యాలతో పార్టీ ఎదిగిన తీరు చూసి ఏపీ అభివృద్ధి కోసం, సానుకూల దృక్ఫథంతో బీజేపీలో విలీనం కావాలని భావించారు. ఈ రోజు ఉదయమే చర్చ జరిగింది. తమ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ మేరకు అమిత్ షాతో చర్చించి చర్యలు తీసుకున్నాం. 
 
ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడును కలిసి లేఖ కూడా ఇచ్చాం. టీడీఎల్పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వారు, స్వీకరిస్తున్నట్లు మేమూ వెంకయ్యకు లేఖలు ఇచ్చాం. ఇక వీళ్లు బీజేపీ సభ్యలు. భారతీయ జనతా పార్టీ సానుకూల, సమీకృత రాజకీయాలను విశ్వసిస్తుంది. అందరితో పాటు, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం.. అలా అందరి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. నాకు నమ్మకం ఉంది.. ఈ నలుగురూ ఏపీలో క్షేత్రస్థాయి నాయకులు. వీరితో పాటు సానుకూలంగా పనిచేస్తే ఏపీలో బీజేపీకి మద్దతు లభిస్తుంది. తద్వారా ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తాం’’ అన్నారు.
 
‘సహకారం, సమన్వయంతోనే పనిచేయాలి తప్ప పోటీ పడి, గొడవలు పడి పనిచేయకూడదు’ - సుజనా చౌదరి
 
‘‘తాజా ఎన్నికల ద్వారా దేశం మూడ్ ఎలా ఉందో అంతా చూశారు. దాంతో మేం కూడ దేశ నిర్మాణంలో భాగం కావాలనుకున్నాం. అది ఒక కారణం. నా వరకూ నేను మూడున్నరేళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా ప్రధాని నేతృత్వంలో పనిచేశాను. దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. పలు కారణాల వల్ల ఏపీ ఇబ్బంది పడింది. ఏపీ అభివృద్ధికి, విభజన చట్టంలో చేసిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ఇదే సరైన వేదిక అని మేం భావించాం. సహకారం, సమన్వయంతోనే పనిచేయాలి తప్ప పోటీ పడి, గొడవలు పడి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాం’’ అని సుజనా చౌదరి చెప్పారు.
 
టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం
రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు. ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు.
 
తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్, ఎంపీలు గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేశ్ ఈ లేఖపై సంతకాలు చేశారు. ‘‘రాజ్యసభలో ఆరుగురు ఎంపీలం ఉన్నాం. రాజ్యసభలో బీజేపీకి ఎంపీల బలం కావాలి. మాది వెనుకబడిన ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. నాకు బీజేపీతో ఎన్నో దశాబ్ధాలుగా అనుబంధం ఉంది. మేం బీజేపీలో చేరుతున్నాం. అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లే కదా..’ అని టీజీ వెంకటేశ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.