బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (20:39 IST)

కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి....

కొబ్బరి బొండాలు సౌందర్య పోషణలోనూ బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరిబొండాం నీళ్లలో మెండుగా ఉంది. ఈ నీళ్లతో పాటు కొబ్బరి పాలను కూడా సౌందర్య పోషణలో వాడొచ్చు. వేసవికాలంలో ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 
అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.
 
వేసవిలో చెమటతోపాటు చర్మంపై పేరుకుపోయే మురికివల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
 
చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.