శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:56 IST)

లగ్జరీ కార్లు, సిగరెట్లు మరింత ప్రియం.. గృహోపకరణాల ధరల్లో తగ్గుదల

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఆయన సోమవారం లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచనున్నట్టు ప్రకటించారు. దీంతో సిగరెట్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. 
 
అలాగే, రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న కంపెనీలకు 10 శాతం సర్‌చార్జ్‌ విధిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దీంతో లగ్జరీకార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వ్యసాయరంగ అభివృద్ధి కోసం 0.5 శాతం పన్ను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాక కార్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌‌ను కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆభరణాలపై ప్రత్యేక లెవీ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. 
 
అదేసమయంలో గృహోపకరణాలు, రిప్రెజిరేటర్స్‌ ధరలు తగ్గనున్నాయని తెలిపారు. వికలాంగుల కోసం తయారు చేసే ఉత్పత్తులపై ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నామని అన్నారు. పెన్షనర్లకు ట్యాక్స్‌ మినహాయింపు నిచ్చామన్నారు. 
 
గృహ రుణం తీసుకునేవారికి అరుణ్ జైట్లీ వరాలు కురిపించారు. రూ.35 లక్షలలోపు హౌసింగ్‌లోన్‌ తీసుకునేవారికి రూ.50 వేలు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఇన్‌కంట్యాక్స్‌ లిటిగేషన్లను తగ్గిస్తామని జైట్లీ హామినిచ్చారు.