శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:12 IST)

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి.. ఎందుకంటే...!

సాధారణంగా బంగారం కొనుగోలుకు అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. అందుకే ఆ రోజున కనీసం ఒక్క గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే, ఈ యేడాది అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొనుగోలు చేయవద్దని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ.. ఇందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు.
 
సాధారణంగా ఆస్తి కేటాయింపు ప్రణాళికల్లో భాగంగా ఈక్విటీలు, భూమి, బంగారం తదితరాలపై పెట్టుబడులు పెట్టే భారతీయులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే మార్గాల్లో బంగారం ఒకటి. అదేసమయంలో గత యేడాది అక్షయ తృతీయ రోజున బంగారంపై పెట్టిన పెట్టుబడి కనీస వడ్డీని కూడా అందించక పోగా, ధర 8.4 శాతం తగ్గింది. ఇక గడచిన మూడేళ్ల పరిస్థితిని చూసినా ఇలాగే ఉంది. 
 
2012 అక్షయ తృతీయ నాటి బంగారం పెట్టుబడి ప్రస్తుతం 3.4 శాతం తగ్గిపోయింది. సమీప భవిష్యత్లో సైతం ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెడితే, ప్రపంచ మార్కెట్లు ముందడుగు వేస్తాయి. దీంతో సహజంగానే బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయన్నది వారి అభిప్రాయంగా ఉంది. బులియన్ మార్కెట్లో రిస్క్ అధికమవుతుందని అంచనా వేస్తున్నారు. ధరలు భారీగా పతనం కాకపోయినప్పటికీ, ఎక్కువ పెరుగుదల కూడా నమోదుకాదని వారు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా గత 2003 నుంచి 2012 వరకూ సరాసరి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా బంగారం కొనడం డబ్బుకు అంత విలువ తెచ్చిపెట్టదని సూచిస్తున్నారు. వివాహ సీజన్‌లో కొంతమేరకు ధరలు పెరుగుతున్నట్టు కనిపించినా, మోడీ సర్కారు తీసుకున్న బంగారంపై దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తే, దేశవాళీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకూ దిగివస్తుందని అంచనా.