మేకిన్ ఇండియాతో ఎఫ్డీఐలు పెరిగాయ్.. నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియాతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 37 శాతం పెరిగాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అక్టోబరు 2014 నుంచి ఫిబ్రవరి 2016 వరకు.. 17 నెలల వ్యవధిలో పై మేరకు పెట్టుబడులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.
ఈ విషయమై వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. ఎఫ్డీఐలు గత 15 నెలల్లో 29 శాతం పెరిగినట్లు తెలిపారు. 2014 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాని ప్రారంభించిందన్నారు. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ప్రభుత్వం మొత్తం 204 ప్రతిపాదనలను అందుకుందని తెలిపారు. వాటి విలువ 39.32 బిలియన్ డాలర్లని చెప్పారు.
2016లో ఇప్పటి వరకు 64 ఎఫ్డీఐ ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైనర్స్ ఒప్పందాన్ని (ఐఈఎం)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వరసగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లు ముందు వరసలో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.