గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (13:00 IST)

అమెరికాపై భారత్ ప్రతీకార చర్యలు

అమెరికాపై భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై సుంక రహిత ప్రయోజనాలను అమెరికా వెనక్కి తీసుకుంది. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా తన వంతు చర్యలు చేపట్టింది. స్వదేశంలో దిగుమతి అవుతున్న 28 రకాల అమెరికా వస్తు ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించాలని భారత్ నిర్ణయించింది. వీటిలో ఆల్మండ్, యాపిల్, వాల్‌నట్ వంటి పండ్లు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే అమెరికా నుంచి దిగుమతి అయ్యే వివిధ రకాల పండ్లు ధరలు విపరీతంగా పెరిగిపోనున్నాయి. 
 
అల్యూమినియం, స్టీల్ తదితర వాటిపై కొత్త టారిఫ్‌లను ఎత్తివేసేందుకు అమెరికా తిరస్కరించడంతో గతేడాది జూన్‌లో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని 120 శాతం వరకు విధించాలని నిర్ణయించింది. అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన చర్చలు జరగడంతో ఈ నిర్ణయం అమలు వాయిదా పడుతూ వస్తోంది. 2018 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విలువ 152.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
 
ఇక, అమెరికా నుంచి ఆల్మండ్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న తొలి దేశంగా, యాపిల్స్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రెండో దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కాగా, భారత్ తాజా నిర్ణయంతో వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి.