గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (15:48 IST)

కేంద్రానికి దడ పుట్టిస్తున్న ఉల్లి ధర.. భారీగా దిగుమతికి ఓకే

దేశంలో ఉల్లి ధర ఒక్కసారి ఆకాశానికి తాకింది. చిల్లర మార్కెట్‌లో వీటి ధరలు ఒక్కసారిగా రెట్టింపు (50 శాతం) పెరిగాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోగా ఇది కేంద్రానికి దడ పుట్టిస్తోంది. ఉల్లి ధరల అదుపునకు ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ ధరల పెరుగుదలకు కళ్లెం వేయలేక పోతున్నారు. ఎగుమతులు నిరుత్సాహపరిచేలా ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరను పెంచి... దిగుమతులను ప్రోత్సహిస్తున్నప్పటికీ వీటి ధరలు మాత్రం తగ్గడం లేదు. 
 
దేశంలో ఉల్లికి ప్రధాన మార్కెట్లు పుణే, లసల్‌గావ్‌‌లు. ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి ధర 50 శాతానికిపైగా పెరిగింది. దీనికితోడు రిటైల్‌ మార్కెట్‌లో కూడా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పుణేలో రూ.14 నుంచి రూ.23కి మధ్యన ధర పలుకుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.40 పైమాటే. వాతావరణం అనుకూలం లేకపోవడం, సరైన దిగుబడులు లేక ధరలు పెరిగాయని, మార్కెట్‌లోకి సరుకు వస్తే ధరలు వాటంతట అవే తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
 
అయితే, మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కరువుతో పాటు.. బ్లాక్‌మార్కెటింగ్‌ కారణమని ప్రభుత్వం భావిస్తోంది. బడాబడా వ్యాపారస్తులు, పెద్ద రైతులు ఉల్లిని బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయకుండా.. నిల్వ చేస్తున్నారని అనుమానిస్తోంది. త్వరలో విజిలెన్స్ దాడులు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.