గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (14:54 IST)

దేశంలో తగ్గనున్న పెట్రోల్ - డీజిల్ ధరలు.. ఏ క్షణమైనా ప్రకటన

దేశంలో మరోమారు పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు బాగా తగ్గడంతో దేశంలో కూడా చమురు ధరలను తగ్గించాలన్న నిర్ణయానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వచ్చాయి. దీనిపై ఎపుడైనా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 
 
ఇరాన్‌పై ఆరు అగ్రదేశాలు ఆంక్షలు ఎత్తివేయడం, చమురు ఉత్పత్తిని ఇరాన్ పెంచడంతో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు మరింతగా పడిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యారల్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే, 1.05 శాతం తగ్గి 48.01 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
 
న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్‌లో బ్యారలు క్రూడాయిల్ ధర 27 సెంట్లు పడిపోయి 48.52 డాలర్ల వద్దకు చేరింది. ఇదేసమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 7 సెంట్లు తగ్గి 53.31 డాలర్లకు చేరింది. క్రూడాయిల్ డిమాండు పెరిగిందని స్పష్టమైన సంకేతాలు వెలువడేంత వరకూ ధరల్లో ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో జూలై తొలివారంలో సైతం క్రూడాయిల్ ధరలు తగ్గుముఖంగానే ఉన్నందున మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం వెలువడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై శుక్రవారం సాయంత్రం లేదా రేపు చమురు సంస్థలు సమావేశమై తమ నిర్ణయాన్ని వెలువరించవచ్చని తెలుస్తోంది. కాగా, తాజాగా లీటరు పెట్రోల్ ధరపై రూ.4 తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.