గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 జులై 2015 (13:09 IST)

విపక్షాల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. బిల్లులపై ముందడుగే: మోడీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా సమయాన్ని వృథా చేయవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షాలను కోరారు. భూసేకరణ వంటి కీలక బిల్లులపై తాము ముండుగు వేస్తామని.. విపక్షాల ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని మోడీ వ్యాఖ్యానించారు.
 
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతాయని చర్చ సాగుతోంది. పలు అంశాలపై, ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో పంకజ్ ముండే అంగన్వాడీ నిధుల కుంభకోణం, మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, లలిత్ గేట్, స్మృతీ ఇరానీ విద్యార్హతలు తదితర ఎన్నో అంశాలపై బీజేపీ సర్కారును ఇరుకున పట్టేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలు సిద్ధమయ్యాయి. వీటన్నింటికీ ధీటుగా సమాధానం ఇవ్వాలని అటు బీజేపీ సభ్యులు సైతం గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో సోమవారం అఖిల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రతి బిల్లుపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోడీ స్పష్టం చేశారు. "అన్ని అంశాలనూ చర్చించేందుకు పార్లమెంట్ వేదికను వినియోగించుకోవాలి. సభా సమయాన్ని వృథా చేయవద్దు" అని తెలిపారు. భూసేకరణ బిల్లుపై ముందుకు కదలాలని మోడీ సూచించారు.