గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (12:36 IST)

హమ్మయ్యా.. బాదుడు నుంచి ఊరట : ఎస్.బి.ఐ శుభవార్త

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తన ఖాతాదారులకు అతిపెద్ద శుభవార్తను చెప్పింది. గత కొన్ని రోజులుగా కఠిన నిర్ణయాలతో ఖాతాదారుల సొమ్మునుకాజేస్తూ వస్త

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తన ఖాతాదారులకు అతిపెద్ద శుభవార్తను చెప్పింది. గత కొన్ని రోజులుగా కఠిన నిర్ణయాలతో ఖాతాదారుల సొమ్మునుకాజేస్తూ వస్తున్న ఎస్‌బీఐ ఇపుడు వెనక్కి తగ్గింది. ఫలితంగా ఎస్బీఐ ఖాతాలు కలిగి కనీస నిల్వ నిబంధనను పాటించని కస్టమర్ల నుంచి వసూలు చేసే అపరాధ మొత్తాన్ని గణనీయంగా తగ్గించింది. 
 
ఎస్బీఐ తాజా ప్రకటన మేరకు మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు నెలకు రూ.50గా ఉన్న చార్జీలను ఇప్పుడు రూ.15కు తగ్గించింది. ఇక సెమీ అర్బన్, రూరల్ సెంటర్లలో ఈ చార్జీలను రూ.40 నుంచి రూ.12, రూ.10కి తగ్గించింది. ఈ కొత్త చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 
 
కాగా, సేవింగ్స్ ఖాతాల్లో నెలవారీ సగటు నిల్వను ఉంచకపోతే పెనాల్టీ వేస్తున్న విషయం తెలిసిందే. ఈ కనీస నిల్వ మెట్రోల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్‌లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000గా ఉంది. ఈ నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి గత యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అపరాధం వసూలు చేస్తోంది. 
 
అయితే, ఈ బ్యాంకు ప్రతి మూడు నెలలకు ఒకసారి అర్జించే లాభాల కంటే ఇలా పెనాల్టీల ద్వారా ఎస్‌బీఐకి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో బ్యాంక్ ఆర్జించిన లాభాల కన్నా.. ఇలా చార్జీల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువగా ఉంది. దీంతో ఈ చార్జీలను గణనీయంగా తగ్గించింది.