కేంద్రం అనుమతిస్తేనే అప్పులిస్తాం : టీ సర్కారుకు వరల్డ్ బ్యాంకు
కేంద్రం ఓ మాట చెపితేనే మీకు అప్పులిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రవికుమార్ స్పందించారు. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టుల ప్రతిపాదనలు, అవసరాలను పరిశీలించిన తర్వాత టి-సర్కార్ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.
నిజానికి వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు సాయాన్ని తెలంగాణ సర్కారు కోరింది. వివిధ రంగాల్లో ఆరు కొత్త ప్రాజెక్టులకు సుమారు రూ.58,500 కోట్ల రుణ ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు ఎదుట ఉంచింది.
తాగునీటి పథకాలకు రూ.25 వేల కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి రూ.14 వేల కోట్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థ మెరుగునకు రూ.4 వేల కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.3500 కోట్లు, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని టి-సర్కార్ ప్రతిపాదించింది.
టి-సర్కార్ ప్రతిపాదనలపై ప్రపంచబ్యాంకు అధికారులు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.