వచ్చే యేడాది జీతాల్లో 10.8 శాతం పెంపు ఉండొచ్చు.. టవర్స్ వాట్సన్ వెల్లడి
వచ్చే యేడాది వేతన సరాసరి పెంపు 10.8 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ టవర్స్ వాట్సన్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. ఎనర్జీ సెక్టార్లో అత్యధికంగా 11.5 శాతం, టెక్నాలజీలో 10.7 శాతం, ఆర్థిక సేవల విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు 10.4 శాతం, ఫార్మా, హెల్త్ సైన్స్లో 10.9 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
దేశీయంగా వ్యాపార అనుకూల పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినప్పటికీ ఉద్యోగుల ఇంక్రిమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. 2015-16 సంవత్సరానికిగాను సంస్థ ఆసియా - పసిఫిక్ వేతన బడ్జెట్ ప్రణాళిక రిపోర్ట్ను గురువారం విడుదల చేసింది.
వచ్చే ఏడాది సరాసరి ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనావేస్తున్నది. నైపుణ్యం కలిగిన వారికోసం సంస్థలు ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తున్నాయని టవర్స్ వాట్సన్ ఆసియా పసిఫిక్ అధినేత సంభవ్ తెలిపారు. వ్యాపార వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది వేతనాలు 12.5 శాతం పెరగే అవకాశం ఉన్నట్టు తెలిపింది.