శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 మార్చి 2017 (01:42 IST)

టెలికాం రంగంలో అసలైన బాహుబలి ఆవిర్భావం: ఎయిర్‌టెల్ మటాష్

బాహుబలి 2 సినిమా ప్రకంపనలు ప్రపంచాన్ని ఇంకా షేక్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలలో బడా కంపెనీలు విలీనం బాట పడుతూ టెలికాం బాహుబలిని ముందుకు తీసుకువస్తున్నాయి. దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి లైన్‌క్లియర్‌ అయింది.

బాహుబలి 2 సినిమా ప్రకంపనలు ప్రపంచాన్ని ఇంకా షేక్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలలో బడా కంపెనీలు విలీనం బాట పడుతూ టెలికాం బాహుబలిని ముందుకు తీసుకువస్తున్నాయి. దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి లైన్‌క్లియర్‌ అయింది. బ్రిటిష్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్‌ విలీనం అవుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. తమ డైరెక్టర్ల బోర్డులు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయని ఇరు గ్రూప్‌లు పేర్కొన్నాయి. దీంతో విలీనం ద్వారా ఏర్పాటయే కొత్త కంపెనీ అటు ఆదాయ మార్కెట్‌ వాటా, కస్టమర్ల సంఖ్య పరంగా దేశీయంగా అగ్రగామి టెల్కోగా అవతరించనుంది. పూర్తిగా షేర్ల రూపంలో కుదిరిన ఈ డీల్‌ రెండేళ్లలోపు పూర్తికావచ్చని భావిస్తున్నారు.
షేర్ల లావాదేవీ రూపంలో విలీనం ఉంటుంది. విలీనం ద్వారా ఏర్పడే కొత్త కంపెనీలో వొడాఫోన్‌ ఇండియా, దాని పూర్తిస్థాయి అనుబంధ సంస్థ వొడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌లు కలిసిపోతాయి. ఐడియా సెల్యులార్‌ వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేస్తుంది. తద్వారా వొడాఫోన్‌ ఇండియా ప్రత్యక్షంగా భారత్‌ కార్యకలాపాల నుంచి వైదొలగుతుంది. విలీనం తర్వాత ఆవిర్భవించే కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉంటుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ వొడాఫోన్‌ ఇండియాకు చెందిన 4.9 శాతం వాటాను రూ.3,874 కోట్ల మొత్తానికి దక్కించుకోవడం ద్వారా కొత్త కంపెనీలో వొడాఫోన్‌ వాటా తగ్గనుంది. దీనిప్రకారం విలీన సంస్థలో ఐడియాకు 26 శాతం వాటా లభిస్తుంది. మిగతా వాటా ఇతర వాటాదారుల(పబ్లిక్‌) చేతిలో ఉంటుంది. కాగా, విలీన కంపెనీ నియంత్రణను వొడాఫోన్‌ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు సంయుక్తంగా చేపడతాయి. కొత్త కంపెనీకి చైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరించనున్నారు.
 
నంబర్‌ వన్‌ స్థానానికి చేరితే.. ఫలితం ఏమిటంటే..
ట్రాయ్‌ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్‌ నాటికి వొడాఫోన్‌కు ఇండియాలో 20.46 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉంది. మార్కెట్‌ వాటా 18.16 శాతంగా ఉంది.
ఇక ఐడియా సెల్యులార్‌ 16.9 శాతం మార్కెట్‌ వాటా, 19.05 కోట్లమంది యూజర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
భారతీ ఎయిర్‌టెల్‌ కస్టమర్ల సంఖ్య 26.58 కోట్లు కాగా, ఆదాయంలో మార్కెట్‌ వాటా 33 శాతం. ఆదాయం, కస్టమర్ల సంఖ్య పరంగా ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ నంబర్‌ వన్‌ ర్యాంకులో ఉంది.
అయితే, ఇప్పుడు ఐడియా–వొడాఫోన్‌ విలీనంతో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టేసి టాప్‌ ర్యాంకును చేజిక్కించుకోనుంది. ఈ విలీన సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య దాదాపు 40 కోట్ల మందికి చేరనుంది. మొత్తం దేశీ టెలికం యూజర్ల సంఖ్యలో ఇది 40 శాతం.
బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ నివేదిక ప్రకారం.. విలీనం సంస్థ ఆదాయం రూ.80,000 కోట్లుగా ఉంటుంది. ఆదాయంపరంగా దేశీ టెలికం పరిశ్రమలో 43 శాతం మార్కెట్‌ వాటా దీని సొంతం అవుతుంది. దీంతో నంబర్‌ వన్‌ కంపెనీగా ఆవిర్భవిస్తుంది.
విలీనం ఒప్పందం ప్రకారం వొడాఫోన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.82,800 కోట్లు(12.4 బిలియన్‌ డాలర్లు)గా లెక్కతేలుతోంది. ఇక ఐడియా విలువ రూ.72,200 కోట్లు(10.8 బిలియన్‌ డాలర్లు)గా అంచనా వేసినట్లు ఐడియా సెల్యులార్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలిపింది.
వొడాఫోన్‌ ఇండియా, ఐడియాలకు డిసెంబర్‌ 2016 నాటికి రూ.1.07 లక్షల కోట్ల రుణ భారం ఉంది.
విలీన సంస్థకు సంయుక్తంగా దేశంలో ఇప్పటిదాకా కేటాయించిన స్పెక్ట్రంలో 25 శాతానికిపైగా ఉంటుంది. అయితే, స్పెక్ట్రం పరిమితి నిబంధనల ప్రకారం దా దాపు 1 శాతం స్పెక్ట్రం(విలువ సుమారు రూ.5,400 కోట్లు)ను ఈ విలీన సంస్థ విక్రయించాల్సి ఉంటుంది.
విలీనం పూర్తయిన తర్వాత వొడాఫోన్‌ గ్రూప్‌ నికర రుణ భారం దాదాపు 8.2 బిలియన్‌ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా.