బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:34 IST)

తాత్కాలిక ఆర్థిక మంత్రిగా రెండుసార్లు... పియూష్ గోయల్ గురించి కాస్త...

రానున్న ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిం. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. గత ఐదుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ ప్రస్తుతం అనారోగ్య కారణాలరీత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండడంతో ఈ మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
 
కాగా.. ఈయన ఆర్థిక మంత్రిగా రెండోసారి తాత్కాలిక బాధ్యతలు చేపట్టినా‌.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పియూష్‌ గోయల్‌ నేపథ్యంలోకి చూస్తే... అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కుమారుడే పియూష్ గోయల్‌. ఈయన 1964 జూన్‌ 13న జన్మించారు. ముంబయిలోని మతుంగాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన గోయల్‌.. సీఏగా ఆల్‌ఇండియా రెండో ర్యాంక్‌ సాధించారు. 
 
ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారతీయ జనతా పార్టీలో చేరారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బోర్డుల్లో ప్రభుత్వ నామినీ సభ్యుడిగా కూడా పనిచేశారు. గతంలో ఆయన భాజపాలోనే అనేక కీలక పదవులను కూడా చేపట్టారు. 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన విద్యుత్‌, బొగ్గు, గనుల శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. 2017 సెప్టెంబరు 3న గోయల్‌ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
 
కాగా పియూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో అరుణ్‌ జైట్లీ కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు. 2018వ సంవత్సరం మే నుండి ఆగస్టు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇటీవల జైట్లీ మరోసారి అనారోగ్యానికి గురై చికిత్స కోసం అమెరికా వెళ్లిన నేపథ్యంలో గోయల్‌ మళ్లీ తాత్కాలిక ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టారు.