గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (09:25 IST)

2020-21 అకాడమిక్ ఇయర్.. ఐఐటీ క్లాసులు డిసెంబరులో ప్రారంభం

ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తున్న తరుణంలో దేశంలో పలు పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్తగా బీటెక్‌లో చేరే విద్యార్థులకు డిసెంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఐఐటీల పునఃప్రారంభం, ప్రత్యామ్నాయ మార్గాలపై ఐఐటీ డైరెక్టర్లతో ఐఐటీ కౌన్సిల్‌ నియమించిన ఉపసంఘం ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదిక సమర్పించింది. అవకాశం ఉంటే మొదట పీహెచ్‌డీ విద్యార్థులను క్యాంపస్‌లకు రప్పించాలని నివేదికలో సూచించింది. ఇంకొంత వెసులుబాటు ఉంటే ఈ ఏడాది చేరే విద్యార్థులకు అవకాశం కల్పించాలని నివేదికలో సూచించింది.
 
పాత విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో బోధించాలని, కొత్త విద్యార్థులకు డిసెంబర్‌లో తరగతులు ప్రారంభమైనా శనివారాలు, ఇతర సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహించి విద్యాసంవత్సరం పూర్తయ్యేలా చూడాలని పేర్కొంది. ఈ నివేదికపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది.