బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (03:51 IST)

జయ అన్న కుమారుడు దీపక్‌కు శశికళ ఏం మంత్రం వేసిందో? కరివేపాకులా వాడుతోందా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించింది మొదలుగా అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పక్షం వహించిన జయలలిత అన్న కుమారుడు దీపక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించింది మొదలుగా అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పక్షం వహించిన జయలలిత అన్న కుమారుడు దీపక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. జయలలిత అన్న కుమార్తె దీప మొదటినుంచి శశికళకు వ్యతిరేక వైఖరి వహిస్తూ రాజకీయంగా ఆమెకు పోటీ మార్గంలో నడుస్తుండగా ఆమె సోదరుడు దీపక్ మాత్రం శశికళను వదిలి ఉండకపోవడానికి కారణం ఏమిటన్నది ప్రశ్నార్థకమైంది.
 
దీపను ఆసుపత్రిలో కానీ, అనంతరం కానీ జయలలిత వద్దకు కూడా రానివ్వని శశికళ దీపక్‌ను మాత్రం జయలలిత పార్ధివ దేహం చెంత రోజు పొడవునా తన వద్దే పెట్టుకోవడమే కాకుండా జయలలిత నివాసమైన వేదనిలయంలోకి కూడా రానివ్వడం గమనార్హం. అలాగని అతడికి ఏఐడీఎంకేలో ఏదైనా పోస్టు ఇచ్చిందా అంటే అదీ లేదు. పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవిని,  తన బంధువు దినకరన్‌కి సహాయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టి మరీ జైలుకు వెళ్లిన శశికళ చివరకు దీపక్‌ను అవసరం తీరిపోగానే కరివేపాకులా తీసిపారేస్తుందో ఆనే అనుమానం కలుగుతోంది.
 
జయ నివాసం వేదనిలయంపై ఎవరికి అధికారం ఉందన్న గొడవ పరిష్కారమైపోగానే దీపక్‌ను శశికళ సాగనంపవచ్చని అనుమానాలు కూడా బయలుదేరుతున్నాయి. ప్రస్తుతానికయితే దీపక్ జైల్లో ఉన్న శశికళ వద్దకు దినకరన్‌తో పాటు వెళ్లి తాజా రాజకీయ పరిణామాలను వివరించే పనిలోఉన్నాడు. కర్నాటకలోని పరప్పన అగ్రహార జైలులో మీడియతో మాట్లాడిన దీపక్ తనమద్దతు ఎప్పుడూ శశికళకే ఉంటుందని, తన సోదరి దీప విషయమై ఏమీ మాట్లాడనని అన్నారు.