బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (17:45 IST)

పాలకొల్లు పిల్లోడు మాండలిన్ శ్రీనివాస్... ఆయన కచేరి కోసం ఎంజీఆర్ తరలివెళ్లారు...

విఖ్యాత సంగీత కళాకారుడు మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఈయన మన తెలుగుబిడ్డ కావడం తెలుగువారికి గర్వకారణం. చిన్నవయసులోనే మాండలిన్ వాయిద్యంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించడంతో యు. శ్రీనివాస్ కాస్త... 'మాండలిన్ శ్రీనివాస్'‌గా గుర్తింపు పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి పేరు సత్యన్నారాయణ. 1978లో... తొమ్మిదేళ్ల చిరుప్రాయంలోనే శ్రీనివాస్ తన తొలి కచేరీని గుడివాడలో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల్లో ఇచ్చారు. ఆ తర్వాత 1981లో, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ ఏర్పాటు చేసిన మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో కచేరీ ఇచ్చి ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచారు. 
 
ఆ తర్వాత 15 యేళ్ల ప్రాయంలోనే దేశ విదేశాల్లో అంతర్జాతీయ సంగీత దిగ్గజాలతో కలిసి సంగీత కచేరీలు ఇవ్వడం ఆరంభించాడు. 1983లో జర్మనీలో జరిగిన జాజ్ బెర్లిన్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇచ్చిన ప్రదర్శనతో మాండలిన్ శ్రీనివాస్ పేరు అంతర్జాతీయంగా మారు మ్రోగిపోయింది. ఈ ఫెస్టివల్‌లో ఆహూతులు అనేకసార్లు శ్రీనివాస్ ప్రదర్శనను వన్స్‌మోర్ ప్లీజ్ అంటూ.... 'రిపీట్' చేయించుకుని ఆనందించారు. దేశవిదేశాల్లో కొన్ని వేల కచేరీలను మాండలిన్ శ్రీనివాస్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1998లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది, 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డు దక్కింది. 
 
మాండలిన్ శ్రీనివాస్ ప్రతిభాపాటవాలు అనన్య సామాన్యం. జనబాహుళ్యంలో అంతగా పేరులేని మాండలిన్ వాయిద్యానికి విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి లెజెండ్స్ వరకు ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌ అయితే, అమెరికాలో ఓ కచేరీ తర్వాత... శ్రీనివాస్ ఆటోగ్రాఫ్‌ కోసం, చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుంటూ వెళ్లి... మాండలిన్ శ్రీనివాస్ ముందు 'పిల్లవాడిలా' నిలబడ్డాడంటే అతని సంగీతం ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విశ్వవిఖ్యాత బ్రిటీష్‌ సంగీతకారుడు స్టింగ్‌ స్పందిస్తూ.. ''మాండలిన్ శ్రీనివాస్‌ను చూస్తే నాకు కన్నుకుడుతోంది. అతని ప్రతిభను చూస్తే చంపేయాలనుంది'' అంటూ తన అభిమానాన్ని వెల్లడించారు. 
 
అలాగే, తమిళ ప్రజలు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ కూడా మాండలిన్ శ్రీనివాస్ పిచ్చి అభిమానే. 1980వ దశకంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీఆర్ ... దూరదర్శన్‌లో నూనూగు మీసాల మాండలిన్ శ్రీనివాస్ కచేరీ చూసి, వెంటనే శ్రీనివాస్‌తో మాట్లాడాలని తహతహలాడిపోయాడు. తన సెక్రటరీకి ఫోన్‌ చేసి శ్రీనివాస్ నెంబర్‌కు వెంటనే కలపమన్నారు. ఆ రోజుల్లో, శ్రీనివాస్‌కి సొంత ఫోన్‌ అంటూ ఏదీ లేదనే విషయం తెలుసుకుని ఎంజీఆర్‌ తన వ్యక్తిగత కార్యదర్శిని శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి, ఎలాగైనా అతన్ని తన నివాసానికి తీసుకురమ్మని చిన్నపిల్లాడిలా బతిమాలాడారట.
 
కానీ, ఆ రోజు ఓ కచేరీ ఉండటంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇంటికి రావడానికి మాండలిన్ శ్రీనివాస్ నిరాకరించాడు. దీంతో, ఎంజీఆర్ తన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని.... శ్రీనివాస్ కచేరీ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఇలాంటి సంఘటనలు మాండలిన్ శ్రీనివాస్ జీవితంలో కోకొల్లలు... అందుకే మాండలిన్ శ్రీనివాస్ మరణం భారతీయ కళారంగానికి తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.