శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (02:00 IST)

పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా వ్యూహ రచన: ఆ ఎమ్మెల్యేలకు దినకరన్ గాలం..

స్పీకర్ పక్షపాత ధోరణితో ప్రతిపక్షం లేకుండానే తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షను నెగ్గిన అన్నాడిఎంకే శశికళ వర్గం పన్నీర్ సెల్వం పక్షాన నిల్చిన 11 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో మునిగింది. పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్ని, 12 మంది ఎంపీలను తమ

స్పీకర్ పక్షపాత ధోరణితో ప్రతిపక్షం లేకుండానే తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షను నెగ్గిన అన్నాడిఎంకే శశికళ వర్గం పన్నీర్ సెల్వం పక్షాన నిల్చిన 11 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో మునిగింది. పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్ని, 12 మంది ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు తగ్గ కసరత్తుల్లో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ వ్యూహరచనల్లో పడ్డారు. ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ ఆదేశాను సారంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించడమా లేదా పదవీ గండం తప్పదన్న హెచ్చరికతో బలవంతంగా తిప్పుకోవడమా అన్న అస్త్రాల్ని ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారు. 
 
అయితే, ఎట్టి పరిస్థితుల్లో పన్నీరును వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు తేల్చడం విశేషం. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకే రెండుగా చీలింది. చిన్నమ్మ శశికళ శిబిరం, అమ్మ విధేయుడు పన్నీరు శిబిరంగా కార్యకర్తలు చీలారు. అధికారం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగినా, స్పీకర్‌ ధనపాల్‌ రూపంలో క్యాంప్‌ రాజకీయాలతో చిన్నమ్మ విధేయుడు పళనిస్వామికి బలం సమకూరింది. చిన్నమ్మ వీరశపథాన్ని నెరవేర్చామన్న ఆనందంలో ఉన్న టీటీవీ దినకరన్, ఇక, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా వ్యూహ రచనల్లో పడ్డారు.
 
పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను మళ్లీ తమ వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరత్తుల్ని వేగవంతం చేశారు. ప్రభుత్వం తమ చేతిలో ఉన్న దృష్ట్యా, ఇటువైపుగా వస్తే భవిష్యత్తు బాగుటుందని, లేనిపక్షంలో పాతాళంలోకి నెట్టడం ఖాయం అన్న బెదిరింపు ధోరణితో ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళతో భేటీ అనంతరం ఆమె ఆదేశానుసారంగా  ఆహ్వానం పలకడం లేదా, పదవీ గండాన్ని సృష్టించే విధంగా హెచ్చరికలతో ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు ఆ శిబిరంలో చర్చ సాగుతోంది. 
 
ప్రధానంగా తమకు ఎమ్మెల్యేల మద్దతు కీలకంగా ఉన్న దృష్ట్యా, 11 మంది ఎమ్మెల్యేలను గురిపెట్టి గాలం వేయడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం మెజారిటీ నలుగురే ఉన్నందున, డీఎంకే ఎత్తుగడల్ని ఢీకొట్టాలంటే, అటు వైపుగా ఉన్న వాళ్లను ఇటువైపు రప్పించుకోవడం ద్వారా సాధ్యమన్న భావనతో దినకరన్‌ అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు.