శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (01:43 IST)

జైల్లో ఉంటున్నాం మహాప్రభో.. విడిపిస్తే వచ్చి వాలిపోతాం అంటున్న శశికళ ఎమ్మెల్యేలు

వందలాది మంది శశికళ మనుషులు కాపలాగా ఉన్నా వారి గుండెలు స్తిమితంగా లేవు. తమిళనాడు వ్యాప్తంగా ప్రజల్లో, సెలెబ్రిటీల్లో, సాంకేతిక నిపుణుల్లో శశికళ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత వారి గుండెల్ని నీరు గార్చేస్త

వందలాది మంది శశికళ మనుషులు కాపలాగా ఉన్నా వారి గుండెలు స్తిమితంగా లేవు. తమిళనాడు వ్యాప్తంగా ప్రజల్లో, సెలెబ్రిటీల్లో, సాంకేతిక నిపుణుల్లో శశికళ  పట్ల పెరుగుతున్న వ్యతిరేకత వారి గుండెల్ని నీరు గార్చేస్తోంది. లగ్జరీ రిసార్టుల్లో తమకు మసాజ్ చేయిస్తున్నా, ఈత కొలనుల్లో ఈత కొట్టిస్తున్నా, విందువినోదాలతో స్వర్గ సౌఖ్యాలను అనుభవింప చేస్తున్నా ప్రజల్లో ఉన్న వ్యతిరేక వాతావరణం వారిని నిలువునా భయపెడుతోంది. సందు దొరికితే చాలు.. పారిపోయి సెల్వంను శరణు కోరదామని ఎదురు చూపులు, మమ్మల్ని విడిపిస్తే చాలు మహాప్రభో.. వచ్చి వాలిపోతామని వారు గోలుగోలున వాపోతున్నారు. వాళ్లెవరంటే ఇంకెవరు శశికళ గుప్పిట్లో ఉన్న అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు. 
 
అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, శశికళ క్యాంపులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆమెకు ఎదురుతిరిగినట్టు సమాచారం. తాము పన్నీర్‌ సెల్వానికి మద్దతునిస్తామని, తమను విడిచిపెట్టాలని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇందుకు అనుమతించని శశి వర్గం బలవంతంగా వారిని బంధించి రిసార్ట్‌లో ఉంచినట్టు సమాచారం. వందలమంది శశికళ మనుషులు ఎమ్మెల్యేలు జారిపోకుండా, తప్పించుకోకుండా అనుక్షణం కాపలా కాస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ 20 మంది ఎమ్మెల్యేలను శశికళ విడిచిపెడతారా వారు పన్నీరు సెల్వంకు మద్దతునిచ్చేందుకు వీలుంటుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
 
ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు, వారిని తన గుప్పిట ఉంచుకునేందుకు శశికళ  మహాద్భుతమైన ఎత్తుగడ వేశారు. అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విడిగొట్టి.. ఎవరికి తెలియకుండా వివిధ రిసార్టులకు, బీచ్‌లకు తరలించిన సంగతి తెలిసిందే. చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఓ గ్రూపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యాంపుగా ఉన్నారు. ఈ రిసార్టుకు మీడియాను కూడా అనుమతించడం లేదు. 
 
అయితే  ఉన్నఫళానా  ఎమ్మెల్యేలను తరలించడంతో వారు కట్టుబట్టలతో వచ్చారని, దీంతో వారికి సరైన దుస్తులు కూడా అందుబాటులో లేవని, జైలులో ఉన్న భావన వారిలో కలుగుతున్నదని తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో క్యాంపులోని పలువురు ఎమ్మెల్యేలు కలత చెందుతున్నట్టు సమాచారం. శశి క్యాంపులో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అంటున్నారు. 
 
ఏమాత్రం వీలున్నా రిసార్టుల్లోంచి తప్పించుకు పోవడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలియడంతో పన్నీరు సెల్వం బృందం పరమానందంతో పరవశించిపోతుంటే క్షణక్షణానికీ శశికళ గుంపులో ప్రకంపనలు చెలరేగుతున్నాయని వార్తలు. శశికళ ఆధీనంలో ఉంటూ అదృశ్యమైన ఎమ్మెల్యేలను వెంటనే గాలించి తీసుకురమ్మని పన్నీరు సెల్వం సాక్షాత్తూ డీజీపీనే ఆదేశించడంతో శశికళ ముఠా జావగారిపోయింది. శుక్రవారం పరిణామాలు ఇరువర్గాల బలాబలాలను అటో ఇటో నిర్ణయించేస్తాయని అంచనా.