శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (14:07 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మరో 76 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 10,567 శాంపిళ్లను పరీక్షించగా మరో 76 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,118 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 885 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,169 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.
 
మరోవైపు, ఆసియాలో భారత్ రికార్డు... 
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఆసియా దేశాల్లోనే భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కరోనా కేసుల్లో ఆసియా దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది మరణించారు. 
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,90,535కి చేరగా, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,819 మంది కోలుకున్నారు. 
 
కరోనా కేసులపై పీకే సంచలన ట్వీట్ 
ఇదిలావుంటే, దేశంలో నమోదవుతున్న కరోనా కేసులపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సంచలన ట్వీట్ చేశారు. లాక్డౌన్ 1.0 నుంచి అన్‌లాక్ 1.0 మధ్య నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. 
 
కొవిడ్-19 కేసుల సంఖ్యను ఓ మారు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. లాక్డౌన్ తొలి దశ నుంచి అన్లాక్ 1.0 మధ్య కరోనా కేసులు 1002 రెట్లు పెరిగాయని, మరణాలు 1,348 రెట్లు పెరిగాయని అన్నారు. ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 7వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో భారత్ ఉందని గుర్తుచేశారు. 
 
టెస్టుల తర్వాత పాజిటివ్ వస్తున్న కేసుల శాతం 1.3 నుంచి 5 శాతానికి పెరిగిందని, కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు చేరిందని తెలిపారు. జీ-20 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో రెండో స్థానంలోనూ, మరణాల పెరుగుదలలో 4వ స్థానంలోనూ భారత్ ఉందన్నారు. 
 
మార్చి 20 నాటికి 190 కేసులున్న భారతావనిలో జూన్ 1 నాటికి 1,90,535 కేసులు వచ్చాయని, రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల వారం రోజుల యావరేజ్ అప్పట్లో 16గా ఉండగా, ఇప్పుడు 461 రెట్లు పెరిగి 7,384కు చేరిందని ప్రశాంత్ కిషోర్ గుర్తుచేశారు.