గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (10:58 IST)

కరోనా సోకుతుందన్న ఆందోళన వద్దు.. ఆత్మస్థైర్యంతో ఉండాలి?

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రజల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి నెలకొంది. కరోనా పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఆసుపత్రిలో లేదా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సలు చేస్తే కోలుకుంటారు. జబ్బు లక్షణాలు కనిపించినా ఆసుపత్రికి వెళ్లకుండా ఆలస్యం చేస్తేనే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా, కరోనా వైరస్ సోకుతుదన్న ఆందోళన వద్దనే వద్దని, ఆత్మస్థైర్యంతో ఉండాలని వైద్య నిపుణులు పిలుపునిస్తున్నారు. 
 
అయితే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే వ్యక్తిగతశ్రద్ధతో పాటు.. కొన్ని సూచనలు పాటించాలని వారు సలహా  ఇస్తున్నారు. ముఖ్యంగా, మంచి  మాస్కుధరించడం.. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం.. భౌతిక దూరం పాటించడంతో పాటు.. మంచి ఆహారపు అలవాట్లతో కరోనాను కట్టడి చేయవచ్చని అంటున్నారు. ఒక వేళ పాజిటివ్‌ వచ్చినా తీవ్ర ఆందోళనకు గురికాకుండా.. ఉండాలని సూచిస్తున్నారు.
 
* చాలామందికి కరోనా పరీక్షలో పాజిటివ్‌ అని వస్తుంది.. కానీ వ్యాధి లక్షణాలు మచ్చుకు కూడా కనిపిచటం లేదు. అంటే వైరస్‌ వీరిని ఆశ్రయించినా వీరి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. 
 
* ఇన్పెక్షన్‌.. డిసీజ్‌ కాదు. అంటే కరోనా వైరస్‌ శరీరంలో ప్రవేశించినంత మాత్రాన కరోనా వ్యాధిగ్రస్తులు కారు. వ్యాధి లక్షణాలు, దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోలేకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడే కరోనా వ్యాధిగ్రస్తుడిగా గుర్తించాలి.
 
* శరీరంలో కరోనా వైరస్‌ ఉండవచ్చు. అంతమాత్రాన అది ప్రమాదకరం కాదు. ప్రజల్లో దీనిపట్ల అవగాహన లేకపోవడంతో పాజిటివ్‌ వచ్చిందంటేనే హడలిపోతున్నారు. అంతెందుకు ఫలితాలతో సంబంధం లేకుండా కరోనా టెస్ట్‌ చేశారంటేనే వారిని అంటరానివారుగా గుర్తించి వెలివేస్తున్నారు. 
 
* సమాజంలో నెలకొన్న ఈ అనవసర భయాలు కరోనా పాజిటివ్‌ వచ్చినవారు వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజల్లో మార్పు రావాలంటే కరోనా పట్ల వారిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగ కృషి చేయాలి. 
 
* ప్రజల్లో ఆందోళన తగ్గాలంటే స్క్యాబ్‌ ఫలితాలను సాధ్యమైనంత వేగంగా వెల్లడించాలి. ప్రస్తుతం 5 నుంచి 7రోజుల సమయం పడుతోంది. వైరస్‌ సోకినా లేకున్నా పరీక్షలకు నమూనాలు ఇచ్చిన ప్రజలు ఈ వారం పాటు తీవ్రమైన మనో వేదన అనుభవిస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది తనువు చాలిస్తున్నారు. 
 
* ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే. కరోనా ఏ ఒక్కరికో పరిమితం కాదు. అది ఎవరికైనా సోకవచ్చు. కనీస జాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌ బారిన పడినా పెద్ద ప్రమాదం లేదని విశ్వసిస్తూ, వ్యాధి బాధిత కుటుంబాలపై మానవీయత ప్రదర్మిస్తూ ముందుకెళితే కరోనా మహమ్మారిని జయించే రోజు మరెంతో దూరంలో లేదు.