గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (11:10 IST)

కరోనా 'మహా' వ్యాప్తి.. 24 గంటల్లో 15 కేసులు.. ఛత్తీస్‌గఢ్ లాక్‌డౌన్

మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి నిదర్శనం గత 24 గంటల్లో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే. వీటిలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 14 కేసులు కాగా, పూణెలో ఒక కేసు నమోదైనట్టు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. 
 
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్చి 31వ తేదీ వరకు రైళ్లను రద్దు చేశారు. అత్యవసరం కానీ సేవలన్నింటిని బంద్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్‌తో మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటక, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, బీహార్‌లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. 
 
మరోవైపు, కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మీడియాకు తెలిపారు. వారిని ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచామని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్‌ కోవిద్‌-19 బాధితులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కరోనా బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని మంత్రి శ్రీరాములు తెలిపారు. 
 
కాగా, ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు విధిగా స్వీయ నిర్బంధంలో ఉండాలనీ.. సామాజిక దూరం పాటిస్తూ, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ దరిచేరదని మంత్రి శ్రీరాములు వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆస్పత్రికి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ వ్యాపించకుండా నిర్బంధం విధించిన రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్ కూడా చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఆయా ప్రాంతాల్లో మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్లు ప్రకటించింది. దీంతో అత్యవసర సేవల విభాగాలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించింది. 
 
ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెల్సిందే. వీటిలో మెట్రో నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీలతో పాటు లక్నో తదితర ప్రాంతాలు ఉన్నాయి.