శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (14:24 IST)

మైసూరులో కోవిషీల్డ్ ట్రయల్స్ - ఐదుగురు వాలంటీర్లకు టీకాలు

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా - సీరం ఇనిస్టిట్యూట్‌ కొవిషీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా మైసూరులోని జేఎస్‌ఎస్‌ ఆస్పత్రిలో వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో దశలో ఆరోగ్యవంతులైన ఐదుగురు వ్యక్తులకు టీకా ఇచ్చారు. దీంతో భద్రత, రియాక్షన్స్‌, అలర్జీలు.. అలాగే ప్రయోజనకరమైన ప్రభావాలను నమోదు చేయనున్నారు. 
 
దేశవ్యాప్త నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో ఎంపిక చేసిన 17 సైట్లలో మైసూర్‌లోని జేఎస్‌ఎస్‌ హాస్పిటల్‌ ఒకటి. ఐసీఎంఆర్‌ హాస్పిటల్‌ను ఎంపిక చేసింది. ఐసీఎంఆర్‌ దేశవ్యాప్తంగా వంద నమూనాలు సేకరించి, మార్పులను పరిశీలిస్తుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న ఐదుగురు వలంటీర్లు సెప్టెంబర్‌ 29 వరకు వైద్యుల పరిశీలనలో ఉంటారు. తర్వాత మరింత మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.
 
మరోవైపు, భారత్‌లో కొవిడ్-19 కేసులు ప్రతిరోజు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కొన్నిరోజులుగా 75 వేలకు మించి కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 78,761 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 948 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 35,42,734కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 63,498కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకున్నారు. 7,65,302 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,14,61,636 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,55,027 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.