శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (16:59 IST)

కుటుంబాన్నే కాటేసిన కరోనా.. నిండు గర్భిణి మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది..

కరోనా ఓ కుటుంబాన్నే మింగేసింది. చివరికి గర్భణీ మహిళను మాత్రం ఒంటరిగా నిలబెట్టేసింది. ఈ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటన గురించి తెలిస్తే.. ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ప్రేమించి పెళ్లి చేసుకొని.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలనుకున్న ఓ జంటను కరోనా వెంటాడింది. నిండుకుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త, అత్తమామలతో ఆ యువతి కాపురం హాయిగా సాగింది. వారి సంతోషానికి గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. ఇంతలోనే వారి కుటుంబంలోకి కరోనా మహమ్మారి వచ్చి చేరింది. ఆమె అత్తమామలకు కరోనా సోకింది. వీరిద్దరూ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. వరంగల్ ఎంజీఎంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె భర్త కూడా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నో ఆశలతో కోరి పెళ్లిచేసుకున్న భర్త కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. 
 
కడుపులో బిడ్డను చూడకుండానే వారం వ్యవధిలోనే అటు అత్తమామలు, ఇటు భర్త చనిపోవడంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. కరోనా కాటుకు ఆ కుటుంబంలో ముగ్గురు బలైన తీరు అందరినీ కలచివేసింది.