శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (21:56 IST)

కోహ్లికి 'Tie' కట్టిన హోప్... 123 నాటవుట్... ఏం చేస్తాం?

అఫ్‌కోర్స్... క్రీడల్లో అనుకున్నవి తలకిందులు కావడం మామూలే. విశాఖపట్టణంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే పోటీ టైగా ముగిసింది. 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసి టైగా ముగించింది. విండీస్ ఆటగాడు హోప్ వికెట్ల వద్ద పాతుకుపోయాడు. 134 బంతుల్లో 123 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. మిగిలినవారు కూడా తమవంతు ఆట తీరును ప్రదర్శించడంతో భారత్ విజయం జారిపోయింది. టైగా ముగిసింది. 
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోహ్లిసేన 321 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి వీర విహారం చేశాడు. 129 బంతుల్లో 157( 13x4, 4X6) పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. దీనితో వెస్టిండీస్ ముందు 322 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశితమైంది. టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. క్రీజులో దిగిన కొద్దిసేపటికే రోహిత్ శర్మ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత ధావన్ మెరుపులు మెరిపించినా 29 పరుగులకే ఔటయ్యాడు. 
 
కోహ్లి వికెట్ల వద్ద పాతుకుపోయాడు. అతడికి రాయుడు తోడవ్వటంతో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా వెళ్లింది. రాయుడు 73 పరుగులు చేసి నర్స్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. 
 
ఆ తర్వాత వచ్చిన ధోనీ సిక్స్ కొట్టినా ఆట్టే నిలబడలేకపోయాడు. మైక్ కాయ్ బౌలింగులో ఔటై 20 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. పంత్ 17 పరుగులు, జడేజా 13 పరుగులు చేశారు. దీనితో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.