క్రికెటర్ సురేష్ రైనా సిక్సర్ బంతికి అంత పవరుందా? ఏం జరిగిందంటే...
భారత క్రికెట్ జట్టులో అలవోకగా సిక్సర్లు బాదే ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. ఎడమచేతివాటం ఆటగాడైన సురేష్ రైనా... సిక్స్ కొట్టాడంటే ఆ బంతి ప్రేక్షకుల గ్యాలెరీలో పడాల్సిందే. ఇపుడు ఓ సిక్సర్ బంతే ఓ చిన్నారిని
భారత క్రికెట్ జట్టులో అలవోకగా సిక్సర్లు బాదే ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. ఎడమచేతివాటం ఆటగాడైన సురేష్ రైనా... సిక్స్ కొట్టాడంటే ఆ బంతి ప్రేక్షకుల గ్యాలెరీలో పడాల్సిందే. ఇపుడు ఓ సిక్సర్ బంతే ఓ చిన్నారిని గాయపరిచింది. రైనా కొట్టిన ఓ సిక్సర్ బంతి తగిలి ఓ చిన్నారి గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి బెంగుళూరు వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది.
ఈ మ్యాచ్లో రైనా కొట్టిన సిక్సర్ బంతి నేరుగా వెళ్లి గ్యాలరీలో మ్యాచ్ చూస్తున్న చిన్నారికి తగిలింది. సతీశ్ అనే చిన్నారి ఎడమ కాలు తొడకు బాల్ తగలడంతో స్వల్పంగా గాయమైంది. దీంతో బాబును వెంటనే స్టేడియంలోని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మెడికల్ సెంటర్కు తరలించి చికిత్స చేయించారు.
కాలు నొప్పి ఉందని చెప్తే ప్రాథమిక చికిత్స చేశామని, అయితే 10 నిమిషాల తర్వాత బాబు మ్యాచ్ చూడడానికి వెళ్తానని అడగడంతో తిరిగి పంపించినట్లు వైద్యులు తెలిపారు. బాబు తిరిగి గ్యాలరీకి వచ్చి మిగతా మ్యాచ్ చూశాడు. కాగా, బుధవారం నాటి మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.