శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (13:04 IST)

త్రిమూర్తుల్లోని లక్షణాలు అలవర్చుకున్నా.. జింబాబ్వే పర్యటనను అద్భుతంగా ముగిస్తా : రహానే

జింబాబ్వే పర్యటనకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన యువక్రికెటర్ అజింక్యా రహానే తన నాయకత్వ సామర్థ్యం, లక్షణాలపై అచంచలమైన విశ్వసాన్ని వ్యక్తంచేస్తున్నాడు. భారత సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్, టెస్టు జట్టు కెప్టెన్ ధోనీ, వన్డే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలను త్రిమూర్తులతో పోల్చిన ఈ కుర్రోడు... వారి నుంచి అనేక లక్షణాలను అలవర్చుకున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా తనలో ధోనీలోని ప్రశాంత చిత్తాన్ని (కూల్), కోహ్లీలోని దూకుడుని, ద్రావిడ్‌లోని సాధారణతను చూస్తారని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ, కోహ్లీల సారథ్యంలో ఆడిన తాను... ఐపీఎల్‌లో ద్రావిడ్ సారథ్యంలో ఆడినట్టు గుర్తు చేశాడు. ధోనీ ఫీల్డ్‌లో కూల్‌గా ఉంటాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అతని స్థితప్రజ్ఞత చెక్కుచెదరదు. ఓ కెప్టెన్‌గా ధోనీలోని ఈ శైలిని నేను స్వీకరిస్తానని చెప్పాడు.
 
ఇకపోతే ప్రతీ విషయాన్ని అతిసాధారణంగా తీసుకోవడాన్ని ఇష్టపడే ద్రావిడ్ శైలిని ఒంటబట్టించుకుంటానని తెలిపాడు. బెంగుళూరు రాయల్స్‌కు ఆడుతున్నప్పుడు రాహుల్ భాయ్‌లో ఈ తీరును ఆస్వాదించానన్నాడు. అలాగే, కెప్టెన్‌గా సహచరులను ప్రోత్సహిస్తా. వారిలో విశ్వాసాన్ని ప్రోది చేస్తా. అలాగే సహాయక బృందం సలహాలు స్వీకరిస్తా. సీనియర్ ఆటగాడు హర్భజన్ సూచనలూ ఎంతో ముఖ్యం. మొత్తంగా జింబాబ్వే పర్యటనను గొప్పగా ముగించాలనే పట్టుదలతో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.