గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:53 IST)

ఆకాశమే హద్దుగా చెలరేగారు... ఇండో-పాక్ మ్యాచ్‌ హైలెట్స్

అదే ఫలితం.. ఈసారీ వార్‌ వన్‌సైడే.. భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ముందు దాయాది పాకిస్థాన్‌ మళ్లీ బేజారెత్తింది. రికార్డుల మోత మోగిస్తూ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌ సెంచరీలతో హోరెత్తించారు. తొలి విక

అదే ఫలితం.. ఈసారీ వార్‌ వన్‌సైడే.. భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ముందు దాయాది పాకిస్థాన్‌ మళ్లీ బేజారెత్తింది. రికార్డుల మోత మోగిస్తూ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌ సెంచరీలతో హోరెత్తించారు. తొలి వికెట్‌కే 210 పరుగుల భాగస్వామ్యం నమోదయిందంటే వీరిద్దరి ఆటతీరు ఏ స్థాయిలో సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 
అంతకుముందు పాక్‌ ఇన్నింగ్స్‌లో షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ నిలకడను ప్రదర్శించడంతో భారీ స్కోరు ఖాయమే అనుకున్నారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు తప్పదని భావించారు. కానీ భారత పేసర్‌ బుమ్రా పదునైన బంతులకు చివర్లో పాక్‌ స్కోరు పూర్తిగా గాడి తప్పింది. దీంతో భారత్‌కు మళ్లీ ఓ మాదిరి లక్ష్యమే ఎదురుకాగా ఆడుతూ పాడుతూ వరుసగా రెండో విజయాన్నందుకుంది.
 
మ్యాచ్‌ హైలెట్స్‌ను పరిశీలిస్తే...
* లక్ష్య ఛేదనలో భారత్‌కిదే అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం (210). 
* వికెట్ల తేడా(9) పరంగా పాక్‌పై భారత్‌కు ఇదే భారీ విజయం.
* భారత్‌ తరపున ఎక్కువసార్లు (13) సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని అందించిన రెండో భారత జోడీగా రోహిత్‌, ధవన్‌.
* తొలిస్థానంలో గంగూలీ, సచిన్‌ (21) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జంటది నాలుగో స్థానం.
* పాకిస్థాన్‌పై ఒకే వన్డేలో రెండు సెంచరీలు నమోదు కావడం భారత్‌కు ఇది మూడోసారి. 
* గతంలో సచిన్‌- సిద్ధు (1996), సెహ్వాగ్‌- ద్రావిడ్‌ (2005) సెంచరీలు చేశారు.
* ఒక మ్యాచ్‌లో ఓపెనర్లు సెంచరీ సాధించడం భారత్‌కు ఇది ఏడోసారి.
* వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా రోహిత్‌. 
* అలాగే ఈ ఫీట్‌కు అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ (181) తీసుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌. 
* అతడికంటే ముందు ఆమ్లా (150), కోహ్లీ (161), డివిల్లీర్స్‌ (166), గంగూలీ (174) ఉన్నారు.
* ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో చేసిన స్కోరు 237/7.
* 237 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 238 పరుగులు చేసింది.