అజ్లాన్ షా కప్ హాకీ పోటీలు: మలేషియాపై ఘనవిజయం.. ఆస్ట్రేలియాతో అమీతుమీ..!
అజ్లాన్ షా హాకీ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. తద్వారా అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో ఏడోసారి టైటిల్ పోరుకు భారత్ దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో భారత 6-1తో ఆతిథ్య మలేషియాను చిత్తు చేసింది. ఫైనల్ చేరాలంటే సర్దార్సేన ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఐదు సార్లు విజేత అయిన భారత.. ఆతిథ్య జట్టుపై ఏకపక్ష విజయం సాధించి మొత్తం 12 పాయింట్లతో డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ (11)ను వెనక్కి నెట్టి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక శనివారం జరిగే తుదిపోరులో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత తలపడనుంది.
కాగా, మరో మ్యాచ్లో ఆసీస్ 3-0తో కెనడాపై నెగ్గింది. దీంతో లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆసీస్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో ఆసీస్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. గతేడాది మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓడింది. భారత కాంస్య పతకం నెగ్గింది. కాగా, టీమిండియా చివరగా 2010లో ఫైనల్ ఆడింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దవడంతో దక్షిణ కొరియాతో టైటిల్ పంచుకుంది.